ఉడతమ్మ ఉపదేశం


1. ఉడతమ్మ ఉపదేశం


గోదావరి నదీతీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడడానికీ, అడవిలోని చెట్లను చూడడానికీ, దూరప్రాంతాల ను౦డి కూడా చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచి న వారు, తమవెంట రక రకాల కాయలను పళ్ళను మిఠాయిలను తెచ్చుకొనేవారు. తిన్నంత తిని , మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు.

ఒకసారి ఈ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్ళు రకరకాల ఫలహారాలు తెచ్చుకొన్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసిన వన్నీ చూశారు. అలసిపోయి ఓ చెట్టుకింద కొచ్చారు. వచ్చాక - తాము తెచ్చుకొన్న మూటలు పాట్లాలు విప్పుకొని కడుపు నిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు క్రిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక వెళ్ళిపోయారు.

ఇదంతా ఆ చెట్టు తొర్రలో ఉన్న ఉడత పిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్ళక్కడకు వెళ్ళిపోయాక ఆ ఉడతబ్బాయి కిందికి దిగివచ్చాడు. చెల్లాచెదురుగా చెట్టు కింద పడిఉన్న మిఠాయి ముక్కల్ని ముందు -కొంచెంగా రుచి చూశాడు. అవి తియ్యగాను రుచిగానూ ఉన్నాయి. తాను తినగలిగినన్నీ తిని -మిగిలిన వాటిని అమ్మకోసం అట్టి పెట్టాడు.

సాయంకాలం అయ్యేసరికి, ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడుత వచ్చింది. రాగానే - ఓ ఆకులో కాసిని మిఠాయి తునకలుంచి అమ్మ ముందు ఉంచాడు ఉడతబ్బాయి.

కొడుకు వేపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ.

జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పీ చెప్పీ చివరికిలా అన్నాడు-

“అమ్మా ! నువ్వు ఇంతకాలమ్మూ ఈ అడివిలో దొరికే పిందెల్నీ, కాయల్నీ మాత్రమే నాకు పెడుతున్నావు. నేనూ తింటున్నాను. ఈ (ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకొన్నాను. నువ్వయినా - నాకెప్పుడూ ఈ మిఠాయిలు సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకని?” అన్నాడు ఉడతబ్బాయి.

ఉడతమ్మ సన్నగా నిట్టూర్చింది.

“నాన్నా! ఇలాంటివి నాకూ తెలుసు, కావాలనే, వీటిని గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటు పడడం తేలిక, ఆ అలవాటు నుండి బయట పడడం కష్టం. ముందుగా - కష్టాలంటే ఏమిటో తెలియాలి అని బాగా అనుభవించాలి. ఆ తరువాత సుఖాలు రావాలి.”

“కొంతకాలం సుఖపడిన తరువాత, దురదృష్టవశాత్తూ కష్టాలు వచ్చాయనుకో - అప్పుడు, ఆ కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇబ్బందులు ' పడనవసరం ఉండదు. అందుకే - నీకీ మిఠాయిలను గురించీ అవి తినడంలో ఉండే సుఖాలను గురించీ చెప్పలేదు నాన్నా ! అంతేగానీ, నీమీద కోపంతో కాదు.”అన్నది ఉడతమ్మ.

“ఈ మిఠాయిలూ అవీ దొరకడం చాలా కష్టమా?” అన్నాడు ఉడతబ్బాయి దూరంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ.

“ఒకరకంగా కష్టం! ఇంకో రకంగా కష్టంకాదు. అయినా -నాకు తెలీక అడుగుతున్నాను ; ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్నా?” అన్నది ఉడతమ్మ.

“ఎప్పుడో ఒకప్పుడు తప్ప కుండా తెలుసుకొనవలసినవి ఇప్పుడే తెలుసుకోవడంలో,దోషమేమీ లేదు గదా! అందుకే - అన్నీ అడుగుతున్నాను.”

నేనో విషయం స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా! నేను ఇకముందునుంచి, ఈ పచ్చికాయల్యూ పిచ్చికాయలూ తినను. నాకు ఖర్జీదెన భోజనమే కావాలి. అని నువ్వెలా తెస్తావోకూడా నాకు అవసరం లేదు, అవి నీవు తెచ్చిపెడుతున్నంతకాలం నీతో ఉంటాను. మానేసిన రోజున, చెప్పాపెట్టాకుండా ఎటో పోతాను. అప్పుడు నాకోసం నువ్వు ఏడ్చినా మొత్తుకొన్నా లాభంలేదు. తరువాత ని ఇష్టం!” అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండెలు గుభేలుమన్నాయి.

“నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈ రోజు ఉదయం తను బయటికెడుతున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగట్టుకొని ఇంటికి వచ్చేసరికి కుర్రాడిలా తయ్యారయ్యాడేమిటి?”

ఉడతమ్మ కొడుకుని కావలించుకొంది.

బంగారు. కన్నయ్యలాంటి తనకొడుకు ఇలా బండబారి పోవడానికిగల కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది!

“బుజ్జినాన్నా ! నువ్వెప్పుడూ ఏదీ నన్ను అడగలేదు. ఇంత కాలానికిగాను, నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే! ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా! పిచ్చితండ్రీ!

“చిన్నతనంలో, అవీ ఇవీ తినాలని అందరికీ అనిపిస్తుంది. నాచిన్నప్పుడు, నేను అమ్మాను నాన్నను ఏవేవో కావాలని నేనూ అడిగాను. కాకపోతే ఓ చిన్న సంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో!” అన్నది ఉడతమ్మ.

“ఏమిటది?” అన్నాడు ఉడతబ్బాయి.

“రేపు - నాకూ చిన్నతనం రావచ్చు - నాక్కూడా, అవీ ఇవీ తినాలని అనిపించవచ్చు. ఆప్పుడు నేనూ నిన్ను అడుగుతాను. ఆలా అడిగినపుడు, నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతేచాలు” అన్నది ఉడతమ్మ.

ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి, అమ్మవేపు చూశాడు.

“అదేమిటీ? మళ్ళీ నీకు చిన్నతనం రావడమేమిటీ?” అన్నాడు ముఖం చిట్లిస్తూ,

“ఎల్లకాలం నేను ఇలాగే ఉండను గదా! ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది గదా! అప్పుడు నేనూ- నీకు మల్లేనే ఎక్కడికీ కదలేనుగదా! ఏమీ సొంతంగా తెచ్చుకోలేనుగదా! ఆ రెండో చిన్నతనంలో, నాకూ అవీ ఇవీ తినాలనిపించినపుడు- నువ్వీ విషయాలన్నీ గుర్తుంచుకొని, విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకంతకన్నా ఇంకేమీ అవసరం లేదు” అన్నది ఉడతమ్మ.

“అమ్మా! నువ్వు నన్ను చూసినంత బాగా నేనూ నిన్ను చూడాలని, ఇన్నిసార్లెందుకు చెబుతున్నట్టు? ఇప్పుడలా జరగడంలేదా?” అన్నాడు ఉడతబ్బాయి.

“మొన్నమొన్నటి దాకా అలానే జరుగుతూ ఉందినాన్నా! ఈ మధ్యనే మనవాళ్ళు మనుషుల్ని చూసి చెడిపోవడం (ప్రారంభించారు. అందుకే ఇంతగా చెప్పవలసివస్తూన్నది” అన్నది ఉడతమ్మ కొడుకు వేపు జాగ్రత్తగా చూస్తూ.

ఉడతబ్బాయి కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.

“అమ్మా! నాకేమీ వద్దు. నా కోసం నువ్వు కస్టపడను కూడా వద్దు. నువ్వు తప్ప- ఇంకేమీ నాకు వద్దు.” అన్నాడు ఉడతబ్బాయి. వాళ్ళమ్మ కాళ్ళకు చుట్టుకుపోతూ.

Responsive Footer with Logo and Social Media