రాజధర్మం



మామిడిపళ్ళు కావాలని మారాం చేసిన ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకుని బయటికి వచ్చాడు ఇంద్రపాలితుడు. పిల్లాడికి పళ్ళు కొనిపెట్టలేదు సరికదా, పిల్లాణ్ణి దాచేసి, తిరిగొచ్చాడు. పిల్లాడేడి? అని అడిగిన ధనగుప్తునితో ఇలా చెప్పాడు ఇంద్రపాలితుడు.‘‘గెద్ద ఎత్తుకుపోయింది.’’ఆ మాటకి ఆశ్చర్యపోయాడు ధనగుప్తుడు. పిల్లాణ్ణి గెద్ద ఎత్తుకుపోవడమేమిటి? అని ఆలోచించాడు. అసంభవం అనిపించింది. అసాధ్యమనిపించింది. కోపం వచ్చిందతనికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు.‘‘నిజం చెప్పు? నా పిల్లాణ్ణి ఏం చేశావు?’’ అడిగాడు.‘‘నిజమే చెబుతున్నాను. నీ కొడుకుని గెద్ద ఎత్తుకుపోయింది.’’ గొంతు పెగల్చుకున్నాడు ఇంద్రపాలితుడు.‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోలేదు. నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లాడి వంటి మీదున్న బంగారం కోసం వాణ్ణి పొట్టన పెట్టుకుని ఉంటావు. చంపేసి ఉంటావు. అవునా?’’‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోయింది వాణ్ణి.’’‘‘నోర్ముయ్‌! అబద్ధాలాడకు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. పద’’ అంటూ ఇంద్రపాలితుణ్ణి నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరకి వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు.

‘‘పళ్ళు కొనిపెడతానని పిల్లాణ్ణి తీసుకుని వెళ్ళి, ఏం చేశాడో చేశాడు. పైగా గెద్ద ఎత్తుకుపోయిందని అబ ద్ధాలు ఆడుతున్నాడు.’’ భోరుమన్నాడు ధనగుప్తుడు.‘‘నిజం చెప్పు! పిల్లాణ్ణి ఏం చేశావు?’’ ఇంద్రపాలితుణ్ణి అడిగాడు న్యాయాధికారి.‘‘నేనేం చెయ్యలేదు మహాప్రభో! నిజమే చెబుతున్నాను. పిల్లాణ్ణి గెద్ద ఎత్తుకుపోయింది.’’‘‘పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నిజం చెప్పు’’ గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడిలా ఇంద్రపాలితుడు.‘‘అయ్యా! నేను ఈ ధనగుప్తునికి అరవై బారువుల ఇనుము అప్పగించి, బేరం వస్తే అమ్మిపెట్టమని చెప్పి, పని మీద పై వూరి వెళ్ళి తిరిగొచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నాను. అయితే ఇనుము అమ్మలేదంటూ, అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అన్నాడు. ఏమయిందని అడిగితే ఎలుకలు తినేశాయన్నాడు. ఇనుమును ఎలుకలు తినగా లేనిది, పిల్లాణ్ణి గెద్ద ఎందుకు ఎత్తుకుపోదో మీరే సెలవీయండి.’’అసలు సంగతి అప్పుడు అర్థమయింది న్యాయాధికారికి. నవ్వుకున్నాడతను. ఇంద్రపాలితుడి అరవై బారువుల ఇనుమూ ఎక్కడ దాచిందీ తెచ్చి ఈయమన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు. తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాణ్ణి తీసుకుని వచ్చి న్యాయాధికారి ముందుంచాడు ఇంద్రపాలితుడు.

‘‘బాబూ’’ పరుగున వెళ్ళి పిల్లాణ్ణి కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పుని ఒప్పుకుని శిక్షను అనుభవించాడు.’’ కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమయింది. తనని కరటకుడు కథల రూపంలో తిట్టి పోస్తున్నాడు. భరించాల్సిందేననుకున్నాడు.కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు కింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ చనిపోయాడు. పింగళకుడి కసి తీరింది. యుద్ధంలో అలసిపోయాడేమో! ఆయాసపడుతూ కూర్చున్నాడు పింగళకుడు. కాస్సేపటికి తేరుకున్నాడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూశాడు. తప్పు చేశాననిపించింది. కళ్ళు మూసుకున్నాడు.

ఆలోచించసాగాడిలా.జరిగిందేమిటి? తప్పెవరిది? ఉత్తపుణ్యానికి సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్న వాడు సేవకుల్ని కాపాడాలిగాని, కడతేర్చకూడదు. కాని కడతేర్చాను. ఎంత తప్పు చేశాను. భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి, పోషించేవాడే రాజు. అంతేకాని, ప్రజల్ని భక్షించేవాడు రాజెందుకవుతాడు. కాడుగాక కాడు. నేను రాజుగా పనికిరాననుకున్నాడు పింగళకుడు.తెలిసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు. భయపెట్టాలి. మళ్ళీ తప్పు చేస్తే ఒప్పుకోననాలి. హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్ళీ తప్పు చేశాడు. రెండోసారి చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. కొలువులోంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం. ఆ కష్టమే చేసిన తప్పుకి శిక్షనిపించాలి. అంతేగాని చంపడం ఏమిటి? చేసిన తప్పులకు ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమవుతారు? మిగులుతారా? ప్రజల సంగతి పక్క నుంచు! రాజేం కావాలి. ప్రజల్ని కడతేర్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపడం, చావడం సమస్యలకు పరిష్కారం కాదనకున్నాడు పింగళకుడు.ఇసుక నుండి నూనె తీయొచ్చు. కుందేటికి కొమ్ము మొలిపించవచ్చు. కాని, మంచి సేవకుణ్ణి సాధించడం కష్టం. అందులోనూ ప్రభుభక్తి కలిగిన సేవకుణ్ణి సంపాదించడం ఇంకా కష్టం. సేవకుడు తానొట్టి సేవకుడు అనుకుంటే ఏముంది? వేతనానికి తగిన పని చేసి, వెళ్ళిపోతాడు. తాను ప్రభువుకి కావాల్సినవాణ్ణి, ప్రజలకూ ప్రభువుకూ వారథిలాంటి వాణ్ణి అనుకుంటేనే రాజభక్తులు, దేశభక్తులుగా తయారవుతారు. సంజీవకుడు ఉట్టి సేవకుడు కాడు. గొప్పసేవకుడు. అలాంటివాణ్ణి పోగొట్టుకున్నాను. చేజేతులా చంపుకున్నాననుకున్నాడు పింగళకుడు. కళ్ళిప్పి చూశాడు.

ఎదురుగా చచ్చిపడి ఉన్న సంజీవకుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు పింగళకుడు. సంజీవకుడి చుట్టూ తిరుగుతూ రోదించసాగాడు.‘‘మిత్రమా! మిత్రమా’’ అంటూ గోల గోల చేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో! కొడితే లేస్తాడేమో అనుకుని కాలితో సంజీవకుణ్ణి తడుతూ ఆశగా చూశాడు. ఎక్కడా కదిలిక లేదు. నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్టుగా పొర్లి పొర్లి ఏడవసాగాడు.రాజు ప్రవర్తన అంతు చిక్కకుండా పోయింది, కరట దమనకులకి. కరటకుడయితే ఒకటి ఊహించాడు, ఈ పరిస్థితుల్లో తానిక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదనకున్నాడు. దమనకుడికి కూడా చెప్పకుండా పక్కకి తప్పుకున్నాడు. కరటకుడు అలా అక్కణ్ణుంచి తప్పుకోవడాన్ని చూసి, ‘బతికిపోయాడు’ అనుకున్నాడు దమనకుడు. రాజుని సమీపించాడు.

‘‘వూరుకోండి రాజా, వూరుకోండి.’’ అని ఓదార్చాడు.‘‘చూడేం చేశానో! ఎంత పాపానికి ఒడిగట్టానో’’ అన్నాడు పింగళకుడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు.‘‘పాపం అని ఎందుకనుకుంటున్నారు? మీరేం పాపం చేయలేదు. పుణ్యమే చేశారు. శత్రువుని చంపడం పాపం కాదు! పుణ్యమే’’ అన్నాడు దమనకుడు.‘‘రండి మహారాజా’’ అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరగా తీసుకుని వెళ్ళాడు.‘‘దాహం తీర్చుకోండి’’ చెప్పాడు. కడుపు నిండుగా నీరు తాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగిందతనికి.

‘‘శత్రువుని చంపి దుఃఖించడం రాజ లక్షణం కాదు. రాజన్న వాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం. అది రాజ లక్షణం కాదు.’’ చెప్పాడు దమనకుడు.‘‘జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు, చాటింపు వేయకూడదు. చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికే ప్రమాదం. రాజు మెత్తని వాడని శత్రువే కాదు, ప్రజలూ గ్రహించ కూడదు.’’ అన్నాడు దమనకుడు.‘అవునా’ అన్నట్టుగా చూశాడు పింగళకుడు.‘‘రాచరికం వీధుల్లో పడి రోదించకూడదు. పదండి గుహకి.’’ అన్నాడు. బయల్దేరాడు పింగళకుడు. అతన్ని అనుసరించాడు దమనకుడు.