హిరణ్యకుడి కథ



ఒక రోజు హిరణ్యకుడూ, లఘుపతనకుడూ కబుర్లలో పడ్డారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకోసాగారు.‘‘రోజు రోజుకీ ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు?’’ అడిగాడు లఘుపతనకుడు.‘‘బాగుండదేమో! పళ్ళకూ, జుట్టుకూ, గోళ్ళకూ, మనుషులకూ ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థానబలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది.’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులూ, సింహాల్నీ చూడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా, ఆనందంగా ఉండట్లేదూ? అలాగే మనమూ! యేళ్ళకేళ్ళు ఉన్నచోటే ఉండడం ప్రమాదం కూడాను’’ అన్నాడు లఘు పతనకుడు.‘‘నీకిక్కడ ఉండాలని లేదు. ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం’’‘‘ఎక్కడికంటే...దండకారణ్యం ఉందా? అక్కడ కర్పూరగౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. మంచివాడు. బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నయినా నీతులు చెప్పవచ్చు. వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంథరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు.

అతనితో ఉన్న రోజుల్లో నాకొకొక్కసారి తిండి దొరికేదికాదు, అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే... తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడిప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది.’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి. గౌరవం లేని చోటా, తిండి దొరకని చోటా, బంధుమిత్రులు లేని చోటా ఉండకూడదంటారు. అందుకని, నేనూ నీతో పాటు వచ్చేస్తాను. పద’’ అన్నాడు హిరణ్యకుడు.తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతులేకుండా పోయింది.‘‘నిజంగా వస్తావా’’ అడిగాడు.‘‘నిజంగానే వస్తాను, పద’’ అన్నాడు హిరణ్యకుడు.ఇద్దరూ బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ, కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు.‘‘హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు. మంచివాడు.’’ మంథరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు.‘‘రాజువయితే ఊరిలో ఉండాలి. అరణ్యంలో ఉండడమేమిటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు?’’ హిరణ్యకుణ్ణి అడిగాడు

మంథరుడు.‘‘ఎందుకుంటున్నానంటే...’’ అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు.‘‘అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతనలా నిద్ర పోగానే నేనిలా ఆ ఉట్టెను అందుకుని, గిన్నెలోకి ప్రవే శించి, అందులోని భోజనపదార్ధాలన్నీ తిని త్రేన్చేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించ సాగాడు. ఒకనాడు, వీణాకర్ణుడని, చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడక్కడకి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదేపదే కర్రను నేలకి తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణునికి అంతుచిక్కలేదు.

‘ఏంటయ్యా ఈ గోల’ అడిగాడు.‘ఏం చెప్పమంటావు! ఈ గదిలో ఓ ఎలుక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టెలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్ధాలని తినేస్తోంది. పెద్ద బెడదయి పోయింది దాంతో.’ అన్నాడు. ఉట్టె చాలా ఎత్తులో ఉంది. దాన్ని ఎలుక అందుకోవడమేమిటి? ఆశ్చర్య పోయాడు వీణాకర్ణుడు.‘ఉట్టె మీదికి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్ధాల్ని తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉందే! ఇంత చిన్న ఎలుక,అంత ఎత్తున ఉన్న ఉట్టె అందుకుంటోందంటే...ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే’ అన్నాడు వీణాకర్ణుడు. ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతనికి చప్పున గుర్తుకు వచ్చింది. దాన్ని చెప్పసాగాడిలా.‘ఆ మధ్య నేను రోజూ ఓ బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళేవాణ్ణి. ఓ రోజు నేను భిక్షకు వెళ్ళిన వేళ, ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇలా అనడం వినిపించింది.‘ఇదిగో, రేపు అమావాస్య. సాటి బ్రాహ్మణులకు ఇంత అన్నం పెడితే పుణ్యం. ఏం వండుతున్నావు’ అడిగాడు.‘ఏం వండను? ఉంటే వండిపెడతాను. లేని దానికి ఏం వండను?’ అడిగింది భార్య. ఆ ఇంట అన్నీ నిండుకున్నాయి. ఆ విషయంలో ఆమె చాలా కోపంగా ఉంది.‘ఉంటే ఎవరయినా వండి పెడతారు. లేనప్పుడు వండి పెట్టడమే గొప్ప. ఉన్నదానితోనే ఏదో ఒకటి వండిపెట్టు. అంతేకాని, అది లేదు, ఇది లేదంటూ రాగాలు తీయకు’ అన్నాడు బ్రాహ్మణుడు. భార్య ఇంట్లో లేమిని ఎత్తి చూపడాన్ని అతను తట్టుకోలేకపోయాడు.‘సరే, రాగాలు తీయను. ఉన్నదానితోనే వండిపెడతాను’ అన్నదామె.ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఏదో చేసి నలుగురు బ్రాహ్మణులకూ పెడదామని, నువ్వుల్ని కడిగిందామె. దంచింది. ఎండబోసింది. ఎండబోసిన నువ్వుల్ని చూసి కోడి వచ్చిందక్కడకి.

కాళ్ళతో వాటిని కెలికి, చెల్లాచెదురు చేసింది. బ్రాహ్మణుని భార్య అది చూసింది. అయ్యో అనుకుంది. కోడి కెలికిన నువ్వులు వంటకు పనికిరావు. అవి మైలపడినట్టే! ఇప్పుడేం చెయ్యాలి? భర్తను అడిగింది.‘చుట్టుపక్కల మార్చి చూడు. తెలివితేటలు ప్రదర్శించు’ అన్నాడు భర్త. భార్య పక్కింటికి వెళ్ళింది. అ ఇంటి ఇల్లాలిని పిలిచి, ఇలా అడిగింది.‘కడిగి, దంచి, ఎండబోసిన ఈ నువ్వులు తీసుకుని, ముడి నువ్వులుంటే నాకివ్వండి. ఎంతో మేలు చేసినవా రవుతారు.’ అడగడమే ఆలస్యం, ఆ ఇల్లాలు ముడి నువ్వులిచ్చేందుకు సిద్ధపడింది. గ మనించాడది ఆ ఇల్లాలు భర్త. ఇలా అన్నాడు.‘కడిగి, దంచి, ఎండబోసిన నువ్వులు నీకిచ్చి, ముడి నువ్వులు అడుగుతోందంటే ఇందు లో ఏదో తిరకాసుంది. అడిగి తెలుసుకో’

ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదుగాని, నేనప్పణ్ణుంచీ ఓ నిజం తెలుసుకున్నాను. ఏ పనికయినా ఏదో ఒక కారణం ఉంటుంది. కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్నింతలా ఇబ్బంది పెడుతూ, అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది. దాన్ని కనుక్కోవాలి. అంతేకాని, కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు’వీణాకర్ణుడు చెప్పింది నిజమే! ఏదో బలమైన కారణం ఉంది. అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించాలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలను కున్నాడు. అంతపనీ చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి, అందులో నేను దాచుకున్న భోజన పదార్ధాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువయి పోయింది. తిండి లేక కృశించిపోయాను. నీరసించిపోయి తిరుగుతోంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు.‘చూడూ డబ్బున్నవాడే బలవంతుడు. డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు. నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యమయిపోయావు. అందుకే డబ్బుండాలంటారు. డబ్బు లేకపోతే డుబ్బుకి కూడా పనికిరారు. అన్నీ బాధలే! డబ్బుంటే పేరుంటుంది. పౌరుషం ఉంటుంది. తెలివి తేటలూ, బంధుమిత్రులూ ఉంటారు. అదే డబ్బులేకపోతే ఇవేవీ ఉండవు. పేదరికం కంటే చావే మేలు. పేదరికంతో ఛస్తూ బతికేకంటే చావడం అంత గొప్పపని ఇంకొకటి లేదు. ఆరోగ్యం పోయినా బతకొచ్చు. మాటపడి పోయినా బతకొచ్చు. పేరూ వూరూ పోయినా బతకొచ్చు.

బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకొచ్చు. కాని, డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం.’చూడాకర్ణుని మాటలకి ఎంతగానో ఏడ్చాను. ఉండలేకపోయానక్కడ. చెప్పుకోలేని బాధ. డబ్బు పోగొట్టుకున్న సంగతీ, మనోవ్యథా, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనా, మోసం, అవమానం ఇవేవీ నలుగురికీ చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు, అభిమానవంతుడు ఉన్న వూరినీ, కన్నతల్లినీ విడిచి వెళ్ళడం న్యాయమే! అభిమానం కలవాడు శిరస్సు మీద పువ్వులా ఉండాలి, లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మసి అయిపోవాలి. బిచ్చమెత్తుకుని బతికే కంటే చావడం మేలు అనుకున్నాను. అయినా ఆశ చావలేదు. ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను. పొగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయ పడ్డాను. ఆశ భ్రమల్ని రేపుతుంది. భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు.’’గతాన్నంతా గుర్తు చేసుకోవడంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి. అతనలా కళ్ళు చెమర్చుకోవడాన్ని చూసి లఘుపతనకుడూ, మంథరుడూ బాధగా ఒకరినొకరు చూసుకున్నారు.