మాట పట్టింపు



వీధి కుక్కల అరుపులకు జానకయ్యకు మెలుకువ వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి దాటి వుంటుంది. ఎందుకైనా మంచిదని జానకయ్య తలుపులు తీసుకుని ఇవతలకి వచ్చాడు. చీకటిగా వున్న వీధిలో, గాడిదను చూసి కుక్కలు మొరుగుతున్నవి. అవతల చలి విపరీతంగా వుంది. అతడు కుక్కలను అదిలించి, లోపలికి రాబోతూ, అరుగు మీద ఎవరో ముడిచి పెట్టుకుని పడుకుని వుండడం చూశాడు. "ఎవరు వారు?" అన్నాడు జానకయ్య. ఆ వైపు నుంచి జవాబు లేదు. జానకయ్య ఆ మనిషిని తట్టి చూశాడు. అతను చలికి గడగడలాడి పోతున్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నది. “చలి ఎక్కువగా వుంది. ఒంట్లో బావున్నట్టు లేదు. లోపలికి వచ్చి పడుకో,” అన్నాడు జానకయ్య. అతను అతి కష్టం మీద లేచి, జానకయ్యకు చేతులు జోడించాడు. జానకయ్య అతనికి చేతి ఆసరా ఇచ్చి, లోపలికి తీసుకువెళ్ళాడు. తరవాత చాప పరిచి, కంబళి కప్పి పడుకోబెట్టాడు. ఆ మనిషి మరు క్షణం నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని గురించిన ఆలోచనలతో, జానకయ్యకు చాలా సేపటివరకూ నిద్రపట్టలేదు. ఎవరో తలుపు దడదడ బాదుతూండగా అతడికి మెలుకువ వచ్చింది. ఆ సరికే బారెడు ప్రొద్దెక్కింది. ఆ వచ్చింది అతడి భార్య, రత్నం. ఆమె, ఆ క్రితం రాత్రి అదే ఊళ్ళో బంధువుల పెళ్ళికి హాజరయి, తెల్లవారుతూనే ఇంటికి వచ్చింది. "ఇంత పొద్దెక్కే దాకా పడుకున్నావేం?" అంటూ లోపలికి వచ్చిన ఆమె, చాప మీద కంబళి కప్పుకుని పడుకుని వున్న మనిషిని చూసి, "ఎవరో వచ్చినట్టున్నారే! ఎవరు?" అని భర్తను అడిగింది. "ఏమో, ఎవరో!" అని జానకయ్య జరిగిందంతా చెప్పాడు.

"అయ్యో పాపం! వేడి పాలిస్తే కాస్త తేరుకుంటాడు. మీరు అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి." అంటూ ఆమె హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. జానకయ్య ఆ మనిషిని లేపుదామని ఒంటి మీద చెయ్యి వేసి, ఉలిక్కి పడ్డాడు. రాత్రి నిప్పులా కాలిన అతని ఒళ్ళు, ఇప్పుడు, మంచులా చల్లగా వున్నది. "ఇతను పోయాడే!" అంటూ జానకయ్య ఒక వెర్రికేక పెట్టాడు. వంట గదిలోంచి రత్నం పరుగు, పరుగున వచ్చి, "పోయాడా అయ్యో! ఇప్పుడేం చేద్దాం? అతని ఊరు ఏదో, అతని వాళ్ళు ఎక్కడ వున్నారో!” అంటూ లబలబలాడింది. జానకయ్య ఆ మనిషి నడుం తడిమి చూశాడు. చేతికి గలగలలాడుతూ డబ్బు సంచీ తగిలింది. అతను ఆ సంచీ పైకి తీసి, కింద గుమ్మరించాడు. డబ్బుతో పాటు, ఒక ఉత్తరం కూడా కిందపడింది. అది, ఒక తల్లి కొడుక్కు రాసిన ఉత్తరం. అందులో ఇలా వున్నది.

"బాబూ, నారాయణా! నీకీ మధ్య జ్వరం కాస్తున్నదని, మన ఊరు మనిషి ఒకరు, బజార్లో కనిపించి చెప్పాడు. ఇప్పుడు ఎలా వున్నది? ఇక్కడ నీ తమ్ముడి పరిస్థితి బాగాలేదు. కూతురు పెళ్ళికి మూడువేల రూపాయలు ఎలా తేగలనా అని, వాడి బెంగ. చాలా మంచి సంబంధం. ఈ సమయంలో మీరు పాత స్పర్థలూ, మాటపట్టింపులూ మర్చిపోవాలి. రాధ పెళ్ళికి నువ్వు డబ్బు సాయం చేయాలి. పెద్దవాడివి కనక, తమ్ముడి విషయంలో నువ్వే సర్దుకుపోవాలి. ఈ ఉత్తరం అందగానే ఒంట్లో బావుంటే డబ్బు తీసుకుని బయలుదేరు. ఇక్కడ మేం మరో ఇంటికి మారాం. కొత్త చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే, ఇల్లు తేలిగ్గా కనుక్కోవచ్చు." జానకయ్యకి సంగతి అర్థమైపోయింది. అతడు భార్యతో, “పాపం, తమ్ముడి కూతురు పెళ్ళికి డబ్బు తీసుకుని బయలుదేరి, దారిలో పోయాడు. ఈ ఉత్తరం వెంట వుంచుకోవడం మేలే అయింది! మనకు కనీసం, ఆ తమ్ముడి చిరునామా అయినా తెలిసింది,” అన్నాడు. "మీరు వెంటనే బయలుదేరి ఆ ఊరు వెళ్ళండి. వాళ్ళకు ఉత్తరం, డబ్బూ ఇచ్చేసి, సంగతి చెప్పి తీసుకురండి. మీరు వచ్చేదాకా నేను పెళ్ళివారి ఇంట్లోనే వుంటాను. ఇంటికి తాళం పెడదాం." అన్నది రత్నం. అప్పటికప్పుడు భార్యాభర్తలు ఇంటికి తాళం పెట్టారు. జానకయ్య బాడుగ బండిలో రెండామడల దూరంలో వున్న నారాయణ తమ్ముడి ఊరికి బయలు దేరాడు. అతను ఆ ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది. అతడికి ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. కాని లోపలికి వెళ్ళబోతున్న అతను, లోపలి నుంచి వచ్చే మాటలు విని, గుమ్మంలోనే ఆగిపోయాడు. "అమ్మా! డబ్బెక్కడా దొరకలేదు. ఇక నేను చేయగలిగిందేమీ లేదు. పెళ్ళివారికి మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను." అంటున్నారు ఎవరో, బహుశా తమ్ముడు కాబోలు! "అదేం మాటరా! చక్కటి సంబంధం, డబ్బుకు వెనకాడి వదులుకుంటామా? మీ అన్నయ్యకు డబ్బు తెమ్మని ఉత్తరం రాశాను. తప్పకుండా డబ్బు తెస్తాడు.” అంటున్నది తల్లి. ఆ మాటకు తమ్ముడు పెద్ద గొంతుతో, “నాకు చెప్పకుండా ఉత్తరం ఎందుకు రాశావు? అన్నయ్య డబ్బు చచ్చినా నేను ముట్టను. ఆ డబ్బుతో నా కూతురి పెళ్ళి చేసేది లేదు" అన్నాడు.

“చిన్న మాటపట్టింపుతో, మీ అన్నదమ్ములు పదేళ్ళుగా మొహాలు చూసుకోలేదు. రాధ పెళ్ళితో. మీరు కలుసుకుంటారని ఇన్నాళ్ళుగా ఆశపడ్డాను." అన్నది తల్లి, జానకయ్య తలుపు చప్పుడు చేసి, "నారాయణ తమ్ముడు గారి ఇల్లు ఇదేనా?" అని కేక పెట్టాడు. లోపలినుంచి నలభై ఏళ్ళ మనిషి తలుపు తెరిచి, “ఎవరు మీరు? లోపలికి రండి?" అన్నాడు ఆశ్చర్యపోతూ. జానకయ్య లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని, డబ్బుసంచి బల్లమీద పెట్టి, ఉత్తరం తమ్ముడు చేతికి ఇచ్చాడు. తమ్ముడు ఆ ఉత్తరం చదివి, “ఇది, మా అమ్మ అన్నయ్యకు రాసింది. తను రావడానికి మొహం చెల్లక, అన్నయ్య డబ్బు పంపివుంటాడు. ముందు ఆ డబ్బు సంచీ, నా కళ్ళముందు నుంచి తీసేయండి!" అన్నాడు జేవురించిన మొహంతో “మీ అన్నయ్య స్వయంగా వద్దామనుకున్నాడు. కాని రాలేకపోయాడు. మీరిద్దరూ కలుసుకోవడం మరి ఈ జన్మలో జరగదు,” అంటూ జరిగినదంతా చెప్పేశాడు జానకయ్య. తల్లి ఘోల్లుమన్నది. ఒక క్షణం ఆగి తమ్ముడు అరచేతుల్లో మొహం దాచుకుని, “అన్నయ్యా, నన్ను క్షమించు!" అంటూ ఏడ్వసాగాడు. ఆ ఏడుపు చూసి జానకయ్య ఏమాత్రం జాలిపడకుండా, "బతికున్న మనిషి విలువ తెలుసుకోవటం కష్టం. నీ మీద నీ అన్నకు ఎంత ప్రేమ లేకపోతే, ఒంట్లో బావుండకపోయినా, డబ్బు తీసుకుని బయలు దేరుతాడు? నువ్వు సోదర ప్రేమకు ఇన్నాళ్ళూ దూరం అయావు. ఇప్పుడది కోరినా దొరకదు,” అన్నాడు. ఆ ఇంట శోకాలు విని ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చారు. అంతలో, "ఏమిటిదంతా? ఏం జరిగింది?" అంటూ ఒక ఏభై ఏళ్ళ మనిషి అక్కడికొచ్చాడు. అతణ్ణి చూస్తూనే తల్లీ, తమ్ముడూ ఏడ్పుమాని నిర్ఘాంతపోయారు. తమ్ముడు అతణ్ణి సమీపిస్తూ, "అన్నయ్యా, నువ్వు బతికే వున్నావా! నేను మూర్ఖుణ్ణి, నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను," అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. జానకయ్యకు ఆ వచ్చిన మనిషి తామింతవరకు చచ్చిపోయాడనుకునే నారాయణ అని అర్థమైపోయింది.

సంగతంతా తెలుసుకొని నారాయణ నవ్వి, "నేను డబ్బుతీసుకుని మొన్ననే బయలుదేరాను. రాధకు పట్టుచీర కొందామని పట్నం బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక ముసలాడు, దిక్కులేనివాణ్ణి, బిచ్చం అంటూ వెంటపడ్డాడు. జాలిపడి డబ్బు మూట పైకి తీసి, వాడికి ఒక రూపాయి యిచ్చాను. నేను దుకాణంలో చీరలు చూస్తుండగా, వాడు నా వెనకే తచ్చాడు తూండడం, నాకు అనుమానం కలిగించింది. తీరా చీర తీసుకొని, డబ్బుకోసం చూసేసరికి, మొలలో దాచిన డబ్బు సంచీ లేదు. ముసలాడి కోసం తెగ వెతికాను. వాడు కనిపించలేదు. మళ్లీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకుని, బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో చచ్చిపోయింది. దొంగే అయుంటాడు." అన్నాడు జానకయ్యతో. "ఆ దొంగ చచ్చి మేలు చేశాడు. అతడి పుణ్యమా అని, అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు." అన్నది తల్లి సంతోషంగా. “ఇక నేను వెళతాను. ఇంటివద్ద జరగవలసిన పని చూడాలి," అంటూ జానకయ్య లేచాడు. "వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి, మీ ఇంటిల్లపాదీ తప్పకుండా రావాలి," అంటూ, అన్నదమ్ములిద్దరూ జానకయ్యకు వీడ్కోలు చెప్పారు.